HomeMovie NewsMahesh Fans Are Frustrated With Zee Telugu Serial Advertisements

Mahesh Fans Are Frustrated With Zee Telugu Serial Advertisements

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో తరచుగా బుల్లితెర మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగులో తన కూతురు సితార ఘట్టమనేనితో కలిసి సీరియల్స్ మరియు రియాలిటీ షోలను ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఆ ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కారణంగానే మహేష్ టీవీలో కనిపిస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ‘డాన్స్ ఇండియా డాన్స్’ అనే షోకి మహేష్ మరియు సితార ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఇదే క్రమంలో జీ తెలుగు ఛానల్ లోని దాదాపు అన్ని టీవీ సీరియల్ ప్రోమోలలో కనిపిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ హోదా ఉన్న మహేష్ ఇలా టీవీ సీరియల్స్ ప్రచారం చేయడం, వాటి ప్రోమోలలో కనిపించడం వల్ల సోషల్ మీడియాలో ఆయన మీద భారీ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది.

అయితే మొదట్లో మహేష్ అభిమానులు ఈ విషయంలో తమ హీరోకి మద్దతుగా నిలిచారు. కానీ ఒప్పందం కుదుర్చుకున్నాం కదా అని మహేష్ ను జీ తెలుగు వారు ఏడా పెడా ప్రతి ప్రోమోలో చూపించడం, ఈ క్రమంలో ఇతర హీరోల అభిమానులు దొరికిందే అవకాశంగా తీసుకుని మహేష్ మీద ట్రోల్స్ మరియు మీమ్స్ ఎక్కువగా చేయడంతో ఇక మహేష్ బాబు అభిమానులు కూడా చేతులు ఎత్తేశారు. అసలు మహేష్ జీ తెలుగు తో ఒప్పందం కుదుర్చుకొక పోయి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఆ రకంగా వారు కూడా మహేష్ నిర్ణయం పై అసంతృప్తిగా ఉన్నారు.

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఇలా టీవీ సీరియల్స్ – షోలలో కనిపించడం ఏంటని బాధ పడుతున్నారు. అంతే కాకుండా ఆయనతో పాటు సితార ను కూడా ఇలా బుల్లితెర మీద అరంగేట్రం చేయించడం సరైన పద్ధతి కాదని అభిమానులు ఆందోళన పడుతున్నారని సమాచారం.

మహేష్ బాబు కూతురు సితార తో ఇదివరకు ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ వీడియోలో నటింపజేసిన సంగతి తెలిసిందే. ఇక దానికి ముందే ఆమె క్లాసికల్ డ్యాన్స్ వీడియోలు మరియు ఇతర రీల్స్ వంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అందువల్ల సితారకు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో చక్కని అభిమానుల సంఖ్య ఏర్పడింది. అలాంటిది సితారను ఇలా సీరియల్ ప్రచారాలకు ఉపయోగించడం ఎందుకని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి టీవీల్లో ఇలా కనిపించడం మహేష్ కు కొత్తేమీ కాదు. 2017 లో స్పైడర్ సినిమా విడుదల సందర్భంగా ఆయన ఇలాగే జీ తెలుగులో కొత్త ప్రోగ్రామ్ మరియు సీరియల్స్ కు ప్రచారం చేశారు. అయితే అప్పట్లో ఇంతగా సోషల్ మీడియా ప్రభావం లేదు. అందుకే పెద్దగా ట్రోల్స్ ఏమీ జరగలేదు. అయితే ఇప్పుడు అలా కాదు, సినిమా స్టార్లు చేసే ప్రతి చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాంటి సమయంలో మహేష్ జీ తెలుగుతో ఈ కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అభిమానులకి తలనొప్పిగా తయారయింది.

నిజానికి ఇలా టివిలో కనిపిస్తే అందువల్ల టివి రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కానీ ట్రెండ్ కు తగ్గట్టుగా వినూత్నంగా ప్రచారం చేయకుండా ఇంకా పాత పద్ధతిలో ఏమాత్రం ఆసక్తి కలిగించని విధంగా మహేష్ – జీ తెలుగు యాడ్స్, ప్రోమోస్ ఉండటం వలన అవి ట్రోలింగ్ కు గురవుతున్నాయి అని ఒక వర్గం ప్రేక్షకులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories