Home Blog Page 2104

NKR-19: కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు క్రేజీ ఆఫర్

0

నందమూరి వంశం నుండి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్లు గా చలామణి అవుతున్న నటులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సీనియర్ నటులు నందమూరి బాలయ్య. ఆ వంశం నుంచే మరో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ స్టార్ హీరో కాకపోయినా, తనదైన శైలిలో వైవిద్యమైన సినిమాలు తీస్తూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు క్రేజీ ప్రాజెక్ట్ లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఫాంటసీ మరియు టైం ట్రావెల్ సినిమా ‘బింబిసార’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభించింది. పైగా ఈ సినిమాని నాలుగు భాగాలుగా ఫ్రాంచైజీ తరహాలో తెరకెక్కిస్తున్నారు అని చిత్ర బృందం చెప్పడం విశేషం.

ఇదే ఊపులో కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాని కూడా ప్రకటించారు. తన 19వ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఇతర సాంకేతిక నిపుణులు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై NKR19 వర్క్ టైటిల్ తో సినిమా రూపొందుతోంది.

తాజాగా కళ్యాణ్ రామ్ 43వ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో కళ్యాణ్ ఓ టేబుల్ పై ఉన్న గన్స్ తో సినిమా కథ ఎంటా అని ఆసక్తి కలిగించేలా ఉంది. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

అయితే ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి అని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర దక్షిణ రాష్ట్రాలకు కలిపి 12 కోట్ల బిజినెస్ కు ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇంతే ఆసక్తిని ప్రేక్షకుల్లో కూడా కలిగించి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

సూపర్ స్టార్ అభిమానిగా కనిపించనున్న యువ సామ్రాట్

0

అక్కినేని నాగ చైతన్య హీరోగా రాబోతున్న కొత్త సినిమా థాంక్యూ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య జంటగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఇటీవలే బంగార్రాజు సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మజిలీ చిత్రం నుండి బంగార్రాజు వరకు నాగ చైతన్య సినిమాలన్నీ వరుసగా హిట్స్ అవడం విశేషం.

ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఇది వరకే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఇందులో నాగ చైతన్య పాత్ర.. స్కూల్ రోజులు, కాలేజీ రోజులు ఆ పైన ఒక స్టార్టప్ కంపెనీ యజమానిగా ఎదిగే క్రమంలో ఎలాంటి పరిస్తితులు ఎదురుకున్నాడు? వాటి వల్ల తన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకున్నాడు అనే అంశాలు స్పృశించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సినిమాలో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నారట. హీరో కాలేజీ రోజుల్లో మహేష్ అభిమానిగా చూపిస్తారని, హీరో జీవితంలో ఒక్కో కాలమానంలో ఒక్కో సినిమాని చూపిస్తూ..తద్వారా ఆయా దశలలో హీరో ప్రయాణంలో ఆయా సినిమాలను చూపించే ప్రయత్నం చేశామని నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.

తెలుగు సినిమాల్లో ఇలా హీరోలకు హీరోలే అభిమానులుగా ఉండటం కొత్తేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలను.. వారి డైలాగులను చాలా సినిమాల్లో ఇది వరకు చాలా సినిమాల్లో చుసాం. మరి థాంక్యూ చిత్రంలో మహేష్ బాబు అభిమానిగా నాగ చైతన్య ఎలా అలరిస్తాడో చూడాలి.

థాంక్యూ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా, కొన్ని కారణాల వల్ల విడుదల విషయంలో కాస్త జాప్యం జరిగింది. మొత్తానికి ఈ సినిమాని జూలై 22, 2022 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, మాలవికా నాయర్, అవికా గోర్‌లు హీరోయిన్లుగా నటించారు.

షో టైం చేంజ్ అంటున్న ది వారియర్

0

రామ్ హీరోగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ది వారియర్. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా మరి కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాతో రామ్ తన కెరీర్ లోనే మొట్ట మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే చిత్ర యూనిట్ విడుదల చేసిన పబ్లిసిటీ మెటీరియల్ అయిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్స్ ను బట్టి పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మంచి రేట్లకు జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 44 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1280 థియేటర్లలో విడుదలవుతోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో సినిమాల మొదటి షోలు తొందరగా ప్రదర్శించే అలవాటు చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా క్రేజ్ ను బట్టి ఆయా చిత్ర యూనిట్ అధిక షోలకు అనుమతి తెచ్చుకుని ప్రదర్శించటం ఒక ఆనవాయితీగా వస్తుంది.

అయితే ఆర్ ఆర్ ఆర్, కేజీఫ్ – 2 వంటి భారీ సినిమాలకి లేదా అగ్ర హీరోల సినిమాలకి ఆ అవసరం ఉంటుంది కానీ ఇతర మాస్ చిత్రాలకు ఆ అవసరం ఉండదు. ఐతే అలాంటి స్పెషల్ షోలు కాక పోయినా సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పొద్దున ఎనిమిది గంటలకు షో పడటం మామూలే. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రసాద్స్ థియేటర్ లో 8:45 షో చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ది వారియర్ సినిమాకు మాత్రం అలాంటి ప్రీమియర్ లు ఉండవు అని.. కాస్త ఆలస్యంగా అంటే 9:30 సమయానికి సినిమా ప్రదర్శన మొదలవుతుంది అని తెలుస్తుంది.

భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ సినిమాకు ముందు నుంచి కూడా మంచి ప్రచారం జరగడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో, డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

పరశురామ్ – నాగ చైతన్య సినిమాలో మరో హీరో?

0

గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత దర్శకుడు పరశురామ్ ఈ మధ్యనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టాక్ పరంగా మిశ్రమ స్పందన వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మాత్రం బాగానే రాబట్టుకుంది.

ఈ సినిమా తర్వాత పరశురామ్ తన తదుపరి సినిమా నాగచైతన్య తో చేయబోతున్న విషయం తెలిసిందే. నిజానికి పరశురామ్ – నాగచైతన్య సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సింది.. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆలస్యం అయింది.

ఆ క్రమంలో దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట సినిమాతో బిజీ అవగా, నాగచైతన్య థాంక్యూ సినిమాతో బిజీగా ఉన్నారు. రాశి ఖన్నా, మాళవిక నాయర్,అవికా గోర్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు.

ఇక సర్కారు వారి పాట సినిమా తరువాత పరశురామ్ నాగ చైతన్యతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ పై కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కథలో మరో పాత్రకు ప్రాధాన్యత పెరిగిందట. ఆ పాత్రలో నటించేందుకు ఒక యువ హీరోను వెతికే పనిలో చిత్ర యూనిట్ ఉండగా, ఆ హీరో ఎవరయి ఉంటారు అన్న విషయం మీద ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది.

జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన యువ హీరో నవీన్ పోలిశెట్టి ఆ పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయం పై ఇరు వర్గాల నుంచీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా నాగ చైతన్య అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన “లాల్ సింగ్ చద్దా” లో ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. థాంక్యూ చిత్రం షూటింగ్ లో ఉండగానే విక్రమ్ కుమార్ తో “దూత” అనే వెబ్ సిరీస్ ను కూడా ప్రారంభించారు.

హారర్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్న “దూత” త్వరలోనే అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ లో మళయాళ నటి పార్వతి, అలాగే తమిళ నటి ప్రియా భవాని శంకర్, బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ నటిస్తున్నారు.

విక్రమ్ ఖాతాలో మరో రికార్డు: ఓటీటీ లోనూ ఇరగదీస్తున్న సినిమా

0

లోక నాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కాంబినేషన్‌లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. గత నాలుగు వారాలకు పైగా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం గత వారం ఓటీటీలో విడుదల అయింది.

ధియేట్రికల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా.. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ నిలిచిన విక్రమ్.. తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద కమల్ హాసన్ స్టామినా ఇంకా తగ్గలేదని నిర్ధారణ అయిందని చెప్పవచ్చు.

ఇకపోతే ‘విక్రమ్’ సినిమా జులై 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలోనూ తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ వ్యూయర్ షిప్ సాధించి ఓటీటీలో సరికొత్త రికార్డ్ సృష్టించడం విశేషం.

డిస్నీ + హాట్ స్టార్ లో తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండేలా వెసులుబాటు కలిగించారు డిస్నీ + హాట్ స్టార్ వారు. స్ట్రీమింగ్ కాబడిన ఐదు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. రికార్డ్ స్థాయి వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది విక్రమ్.

ఈ సందర్భంగా హీరో కమల్ హాసన్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ మీడియాతో ముచ్చటించారు. ప్రేక్షకులు అందించిన ఈ అపూర్వ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కమల్ హాసన్ తెలిపారు. థియేటర్స్ లో కలెక్షన్స్ తో పాటు ఇప్పుడు ఓటీటీలో కూడా హయ్యెస్ట్ వ్యూయర్షిప్ సాధించడం ఆనందంగా ఉందని కమల్ చెప్పారు.

ఇక గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ తమ ఓటీటీ సంస్థలో ‘విక్రమ్ ‘ సాధిస్తున్న రికార్డుల పట్ల చాలా సంతోషంగా ఉన్నామని, ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్ షిప్ లో రికార్డులు క్రియేట్ చేసిన విక్రమ్ దేశవ్యాప్తంగా కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీక్ ను అందించిందని, ఇంత గొప్ప సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం ఆనందంగా ఉందని అన్నారు.

నెట్ ఫ్లిక్స్ తో రాజమౌళి భారీ ఒప్పందం: ఓటీటీ లో ప్రవేశించనున్న దర్శకధీర?

0

ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల బిజినెస్ అద్భుతంగా ఎదుగుతుంది. గత కొన్నేళ్లుగా ఓటీటీ సంస్థల హవా పెరగడం, డిజిటల్‌ వినోదానికి ప్రేక్షకులు బాగా అలవాటు పడటంతో ఈ రంగంలో భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది. ముందు ముందు ఈ పద్ధతి మరింత కొనసాగుతుంది అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఈతరం దర్శకులు కూడా వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కిచండానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఎందుకంటే వెబ్ సీరీస్ లకు నిడివి పరంగా పరిమితులు ఉండవు.అలాగే ఫార్ములాలు లోబడి తీయాల్సిన అవసరం కూడా ఉండదు. తాము అనుకున్నది అనుకున్నట్టుగా ఎన్ని భాగాల్లో అయినా చెప్పే అవకాశం ఉండడం, అలాగే తమ ప్రతిభ ఎక్కువ మందికి చేరువ అయ్యే మార్గం ఉండడంతో అగ్ర దర్శకులు కూడా వెబ్‌ సిరీస్‌ల నిర్మాణానికి పూనుకుంటున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు వెబ్‌ సిరీస్‌లకు దర్శకత్వం వహించగా, కొందరు నిర్మాతలుగా, కథకులుగా వ్యవహరించారు.

ఇప్పుడీ జాబితాలోకి అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తో రాజమౌళి కలిసి పని చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. లోగడ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బాహుబలి: బిఫోర్‌ ది బిగినింగ్‌’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ ఓ వెబ్‌ సిరీస్‌ను ప్రారంభించింది. అయితే ప్రారంభమైన కొన్ని రోజులకే ఆ ప్రయత్నం ఆపేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఆశించిన స్థాయిలో స్క్రిప్ట్ వర్క్ జరగని కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ ఆ సిరీస్‌ను పక్కన పెట్టేసినట్లు తెలిసింది.

ఇప్పుడు ఏకంగా రాజమౌళితోనే వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించేందుకు నెట్ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందించే ఈ వెబ్‌ సిరీస్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ఇతర దేశాల భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇటు రాజమౌళి కానీ, అటు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఒకవేళ అరుదైన ఈ కలయిక నిజం అయితే మాత్రం ఓటీటీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగడం ఖాయం.

OTTలో హిట్ కొట్టిన సుందరం

0

నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలై నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా నాని నుంచి కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమా కోరుకున్న ప్రేక్షకులకి సుందరం అందించిన ఆరోగ్యకరమైన హాస్యం నచ్చినా, ఎందుకో అసలు నాని సినిమా అంటే రావాల్సిన స్థాయిలో థియేటర్ల వద్ద ప్రేక్షకుల కనిపించలేదు. సినిమా బాగానే ఉంది కానీ రకరకాల కారణాల వల్ల ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఈ సినిమాకి చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినా నిర్మాతలు మాత్రం పెద్దగా ప్రమాదంలో పడకుండా బయట పడ్డారు అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ రకంగా నిర్మాతలకు మంచి లాభసాటి వ్యాపారం జరిగినట్లుగా తెలుస్తోంది.ఇక గత ఆదివారం అంటే జూలై 10న అంటే సుందరానికీ తెలుగుతో పాటు తమిళం,మలయాళం భాషల్లో నెట్ఫ్లిక్స్ లో విడుదల అయింది. థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం ఖచ్చితంగా మంచి ఆదరణ పొందుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు, సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

వారి అంచనా నిజం అయింది అనే చెప్పాలి. ఊహించినట్లుగానే ఓటీటీలో సుందరం హవా బాగా నడుస్తోంది. నెట్ఫ్లిక్స్ లో మూడు రోజుల క్రితం విడుదలైన అంటే సుందరానికీ సినిమా.. తెలుగు వెర్షన్ లో మొదటి స్థానంలో, తమిళ వెర్షన్ లో ఆరో స్థానంలో ట్రెండ్ అవుతుందిట. ఈ వార్త ఖచ్చితంగా నానికి మరియు చిత్ర బృందానికి ఆనందాన్ని కలిగిస్తుంది అనే చెప్పాలి. ఇక నాని తన తదుపరి చిత్రం “దసరా” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓడెల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించడం విశేషం.

రైటర్ పద్మభూషణ్ : మరో ఆసక్తికరమైన సినిమాతో వస్తున్న సుహాస్

0

యూట్యూబ్‌ నుండి వెండి తెర స్థాయికి ఎదిగిన నటుడు సుహాస్‌. హీరో స్నేహితుడిగా కొన్ని, అలాగే కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేసి మెప్పించారు. ముఖ్యంగా మజిలీ చిత్రంలో సహయక పాత్రలో సుహస్ నటనకు చక్కని ప్రశంసలు దక్కాయి. అలాగే “ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్రంలోనూ సుహాస్ ఆకట్టుకున్నారు.

ఆ పైన ఓటీటీలో విడుదలైన “కలర్‌ ఫోటో”తో హీరోగా మారారు. ఆ సినిమా కరోనా కారణంగా థియేటర్లకు బదులు ఓటీటీ లో విడుదల చేయడం జరిగింది. ఆ సినిమాలో హీరోయిన్ చాందినీ చౌదరి ప్రేక్షకులకి కాస్త పరిచయం. ఆమె తప్ప సుహస్, దర్శకుడు యూట్యూబ్ నుంచి వచ్చిన వారే. ఆ సినిమాకు సంపూర్ణేష్ బాబు ను హీరోగా పరిచయం చేస్తూ “హృదయ కాలేయం” అనే సినిమాతో అందరి చూపును తమ వైపుకు తిప్పుకున్న సాయి రాజేష్ కథ అందించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. 

ఇక ఆ తరువాత మరోసారి ఓటీటీ లోనే విడుదలైన “ఫ్యామిలీ డ్రామా” లో సైకో కిల్లర్ పాత్రలో నటించి ఔరా అనిపించారు. ఇలా చిన్న కెరీర్ లోనే విలక్షణ నటుడిగా ఎదిగిన సుహస్ .. ఇప్పుడు రైటర్‌ పద్మ భూషణ్‌తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు.

లహరి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక పాటను ఇటీవలే విడుదల చేసారు. ‘కన్నుల్లో నీ రూపమే’ అంటూ సాగే ఈ పాటకు శేఖర్ చంద్ర స్వరకల్పన చేసారు.

సున్నితమైన ఈ మెలోడీ గీతాన్ని భాస్కర భట్ల రాయగా, ధనుంజయ్ పాడారు. సుహాస్ కు జంటగా టీనా శిల్పరాజ్ నటిస్తున్నారు. అలాగే రోహిణి, ఆశిష్ విద్యార్థి వంటి సీనియర్ నటులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.

నితిన్ తప్పేమీ లేదు: అమ్మ రాజశేఖర్ పై మండి పడుతున్న నితిన్ అభిమానులు

0

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్.. ఇటీవల తను దర్శకత్వంలో తెరకెక్కిన “హై ఫైవ్” చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తానే స్వయంగా నిర్మించిన సినిమా ఈవెంట్ కి హీరో నితిన్ ను గెస్ట్ గా పిలిచినా నితిన్ రాకపోవడంతో ఆ వేడుకలో మాట్లాడుతూ అమ్మ రాజశేఖర్ నితిన్ ని ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడారు.

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ… “ఒకానొక సమయంలో నితిన్ కి అసలు ఎలా డాన్స్ చేయాలి అనేది కూడా తెలియదు. నేను నేర్పించాను. నన్ను గురువుగా భావించి గౌరవిస్తాడని అనుకున్నాను కానీ ఈరోజు ఈవెంట్ కి పిలిచినా రాలేదు” అని అన్నారు రాజశేఖర్. హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాక నితిన్ తనని అవమానించాడనీ, షూటింగ్స్ ఏమీ లేకపోయినా కేవలం ఇంట్లో కూర్చుని రాలేదని బాధపడ్డారు.

అలాగే పది రోజుల క్రితమే నితిన్‌ను ఈ ప్రోగ్రామ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించానని ఆయన చెప్పారు. నితిన్ వస్తానని మాట కూడా ఇస్తే ఆ మాట నమ్మి అన్నం కూడా తినకుండా కష్టపడి నితిన్‌ కోసం ప్రత్యేకంగా ఏవీ క్రియేట్‌ చేయిస్తే ఈవెంట్ కు నితిన్ రాలేదని ఆయన వాపోయారు.

గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించానని.. కానీ నితిన్ ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్‌ చేస్తే జ్వరమని చెప్పగా, కనీసం వీడియో బైట్‌ అయినా పంపమని కోరుతే. అది కూడా ఇవ్వలేదని చెప్తూ..”ఒరేయ్ నితిన్ నీ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నిన్ను నేను నమ్మాను. లైఫ్ లో నిన్ను ఎప్పుడైనా కలిస్తే మళ్ళీ అప్పుడు చూద్దాం,” అని నితిన్ పై మండిపడ్డారు.

అయితే ఈ విషయంలో నితిన్ అభిమానులు అన్న రాజశేఖర్ పై కోపంతో ఉన్నారు. అసలు నువ్వు తీసిన టక్కరి సినిమా పెద్ద డిజాస్టర్.. నువ్వు నితిన్ కు డాన్స్ నేర్పడం ఏంటని ప్రశ్నించారు. అలాగే “హై 5” ట్ట్రైలర్ చూస్తే అదొక అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుంది. కాబట్టే నితిన్ అలాంటి సినిమాని ప్రమోట్ చేయడం ఇష్టం లేక వేడుకకి రాలేదని చెబుతున్నారు.

పాన్ ఇండియా ఫార్ములా అదే అంటున్న రామ్

0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొతినేని నటించిన తాజా సినిమా ‘ది వారియర్‌’. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లింగుస్వామి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ క్యార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసి 155 నిమిషాల నిడివిని ఖరారు చేసారు. అంటే దాదాపు 2 గంటల 35 నిమిషాల వరకు ది వారియర్ థియేటర్లలో సందడి చేస్తాడు అన్నమాట.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో హీరో రామ్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్ర పవర్‌పుల్‌గా కనిపిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమాలో వీళ్ళ ఇద్దరి మధ్య రసవత్తరమైన పోరు ఉండేలా ఉంది.

ఇక ఈ సినిమాకి ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతున్నాయి. ఆ క్రమంలోనే హీరో రామ్ పోతినేని కోన్ని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సీరీస్,పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కేజీఫ్ వంటి సినిమాల తరువాత తెలుగు సినిమాలకు బాలివుడ్ మార్కెట్ కూడా ఏర్పడింది.ఈ విషయంపై హీరో రామ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. మనదైన శైలిలో సినిమాలు తీసి వాటిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలి కానీ బాలీవుడ్ ఫార్ములా వైపు పరుగులు తీయడం అంత మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ది వారియర్ తరువాత రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లోనే రామ్ పైన చెప్పిన మాటలు అనడం జరిగింది. రామ్ చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే బాలివుడ్ ప్రేక్షకులకు మన సినిమాల్లో ఉండే అంశాలు వాళ్ళకి కొత్తగా అనిపించాయి.. పాటలు, కామెడీ, ఫైట్స్ ఇలా పక్కా ఫార్ములా చిత్రాలు హిందీలో రావడం అరుదు. అందుకే మన సినిమాలకు అక్కడ శాటిలైట్ మరియు థియేట్రికల్ మార్కెట్ పెరిగింది.

అంతే తప్ప హిందీ సినిమాలా అనిపించాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో రాదే శ్యాం లాంటి సినిమా ఫలితం తోనే మన ఇండస్ట్రీ వర్గాలకి అర్థం అయి ఉండాలి. కేవలం స్టార్ హీరో – హీరోయిన్లు , మంచి పాటలు,భారీ సెట్టింగ్ లు ఉంటే సినిమాలు ఆడవు. మంచి కథ ఉండీ, దాన్ని అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దితేనే బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.