Home Movie News పరశురామ్ – నాగ చైతన్య సినిమాలో మరో హీరో?

పరశురామ్ – నాగ చైతన్య సినిమాలో మరో హీరో?

గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత దర్శకుడు పరశురామ్ ఈ మధ్యనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టాక్ పరంగా మిశ్రమ స్పందన వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మాత్రం బాగానే రాబట్టుకుంది.

ఈ సినిమా తర్వాత పరశురామ్ తన తదుపరి సినిమా నాగచైతన్య తో చేయబోతున్న విషయం తెలిసిందే. నిజానికి పరశురామ్ – నాగచైతన్య సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సింది.. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆలస్యం అయింది.

ఆ క్రమంలో దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట సినిమాతో బిజీ అవగా, నాగచైతన్య థాంక్యూ సినిమాతో బిజీగా ఉన్నారు. రాశి ఖన్నా, మాళవిక నాయర్,అవికా గోర్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు.

ఇక సర్కారు వారి పాట సినిమా తరువాత పరశురామ్ నాగ చైతన్యతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ పై కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కథలో మరో పాత్రకు ప్రాధాన్యత పెరిగిందట. ఆ పాత్రలో నటించేందుకు ఒక యువ హీరోను వెతికే పనిలో చిత్ర యూనిట్ ఉండగా, ఆ హీరో ఎవరయి ఉంటారు అన్న విషయం మీద ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది.

జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన యువ హీరో నవీన్ పోలిశెట్టి ఆ పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయం పై ఇరు వర్గాల నుంచీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా నాగ చైతన్య అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన “లాల్ సింగ్ చద్దా” లో ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. థాంక్యూ చిత్రం షూటింగ్ లో ఉండగానే విక్రమ్ కుమార్ తో “దూత” అనే వెబ్ సిరీస్ ను కూడా ప్రారంభించారు.

హారర్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్న “దూత” త్వరలోనే అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ లో మళయాళ నటి పార్వతి, అలాగే తమిళ నటి ప్రియా భవాని శంకర్, బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ నటిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version